టీపీసీసీ చీఫ్  రేవంత్ కు అద్దంకి దయాకర్ లేఖ

టీపీసీసీ చీఫ్  రేవంత్ కు అద్దంకి దయాకర్ లేఖ

సూర్యాపేట: తుంగతుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటీ చేసి పార్టీ బహిష్కరణకు గురైన వడ్డేపల్లి రవిని పార్టీలోకి చేర్చుకోవద్దని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్  టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకర్గంలో కాంగ్రెస్ ఓటమికి వడ్డే పల్లి రవి కారణమని ఆయన తెలిపారు. వడ్డేపల్లి రవి టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని, ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం ఆయనను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించిందని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో వడ్డేపల్లి రవికి 2700 ఓట్లు పోలయ్యాయని, తాను 1800 ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు తెలిపారు.

రవి వల్లే తాను ఓడిపోయినట్లు తెలిపిన అద్దంకి దయాకర్... అలాంటి వ్యక్తిని మళ్లీ పార్టీలోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు. రాహుల్ గాంధీ  ఆదేశాన్ని ధిక్కరించి ఎన్నికల్లో పోటీ చేసి... కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఓటమికి కారణమైన వడ్డేపల్లి రవిని పార్టీలోకి చేర్చుకోవడాన్ని కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఈ చేరిక పూర్తిగా పార్టీ నిబంధనలకు వ్యతిరేకమని, పార్టీ నిబంధనలను ఉల్లంఘించే పనులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసిస్తున్నారని తెలిపారు. వడ్డెపల్లి రవిని పార్టీలో చేర్చుకోవద్దని రేవంత్, ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం టాగూర్ ను అద్దంకి దయాకర్ కోరారు.